అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన
అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక కేంద్రం – మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, విద్య, కళలు, సాంస్కృతిక విలువలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్లోని సైబర్ మెడోస్ వెంచర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై సాంస్కృతిక కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు, ఆయన ప్రతిపాదించిన సామాజిక సమానత్వం, విద్య, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను కళలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
సాంస్కృతిక కేంద్రం ద్వారా కళాకారులకు, సాహితీవేత్తలకు, విద్యార్థులకు, యువతకు వేదిక కల్పించడంతో పాటు అంబేద్కర్ సిద్ధాంతాలు, సామాజిక చైతన్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శంకుస్థాపన కార్యక్రమంలో కళాకారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.