ఆర్పీసీ లీగల్ సెల్ చైర్మన్గా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియామకం
న్యాయవాదుల సంక్షేమం, వృత్తి భద్రత కోసం పోరాటం: ఆర్పీసీ
గుంటూరు:- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ చైర్మన్గా సీనియర్ న్యాయవాది, మాజీ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి పంగులూరి బుచ్చిబాబు ఈ నియామకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత, సంక్షేమం రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల భవిష్యత్ కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
న్యాయవాదుల మేధస్సు, శ్రమ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయ వనరులు సమకూరుతున్నాయని, న్యాయశాఖ నిర్వహణలో ప్రతి న్యాయవాది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ న్యాయవాదులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక భరోసా, వ్యక్తిగత భద్రత లేకపోవడం బాధాకరమన్నారు.
న్యాయవాదుల సంక్షేమానికి కీలక డిమాండ్లు
న్యాయవాదులు, వారి కుటుంబాలకు రూ.30 లక్షల వరకు ప్రైవేట్, కార్పొరేట్ వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించే విధానం తీసుకురావాలని ఆర్పీసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా స్థానిక న్యాయవాదులకు నామమాత్రపు ధరకు 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ, న్యాయవాదులకు టోల్ ప్లాజాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఆర్పీసీ లీగల్ సెల్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా లీగల్ సెల్ కమిటీల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని అన్ని న్యాయస్థానాల్లో ఆర్పీసీ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా తనపై
నమ్మకంతో ఆర్పీసీ లీగల్ సెల్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత మేడా శ్రీనివాస్, రెండు తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి పంగులూరి బుచ్చిబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. త్వరలో పార్టీ ఆశయాల సాధన కోసం మరింతగా శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు.