పోరుతెలంగాణ డిజిటల్ డెస్క్ :- కుమ్మరిగూడెంలో వన మహోత్సవ కార్యక్రమం అటవీ శాఖ ఆధ్వర్యంలో చెట్టు ఉంటేనే జీవితం, అడవి ఉంటేనే భవిష్యత్తు, మణుగూరు రేంజ్ ఆఫీసర్ ఉపేందర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కుమ్మరిగూడెం బీట్ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో కలిసి భారీ స్థాయిలో మొక్కలు నాటిన అటవిశాక అధికారులు.
ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ ఉపేందర్, పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు మనం జరుపుకుంటున్న తెలంగాణ వనమహోత్సవం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి, ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించాలనే గొప్ప సంకల్పానికి ప్రతీక. చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నీడను ఇస్తుంది, వర్షాలను ఆకర్షించడంలో, భూగర్భ జలాలను కాపాడడంలో, నేల కోతను అరికట్టడంలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పక్షులకు, జంతువులకు చెట్లు ఆవాసాలుగా నిలుస్తాయి, అందుకే చెట్టు ఉంటేనే జీవితం అడవి ఉంటేనే భవిష్యత్తు అని మనం గుర్తించాలి.
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు వనమహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. అయితే మొక్క నాటడం మాత్రమే మన బాధ్యత కాదు, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అది పెద్ద చెట్టుగా మారే వరకు కాపాడటం మన అసలైన బాధ్యత. ప్రతి కుటుంబం కొన్ని మొక్కలను నాటి వాటిని కుటుంబ సభ్యుల్లా పెంచాలి. ప్రతి పాఠశాల ఒక చిన్న వనాన్ని ఏర్పాటు చేయాలి, గ్రామాల్లో రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటాలి. ముఖ్యంగా మన ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో అడవులు మన జీవన విధానంతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. అడవి మనకు ఆహారం, ఔషధాలు, జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా ఆధారం, కాబట్టి అడవులను కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. ఈరోజు మనం నాటే ఒక మొక్క రేపు ఒక కుటుంబానికి నీడనిస్తుంది,ఒక చెట్టు వందలాది జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది, మనం నాటిన మొక్కల ఫలితాలను మన పిల్లలు, మన మనవళ్లు అనుభవిస్తారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మయ్య, బీట్ ఆఫీసర్ అరుణ, మరియు రేంజ్ సిబ్బంది, సర్పంచ్, కలివేటి సరిత, ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ రావు, మరియు గ్రామస్థులు పాల్గొని జయప్రదం చేశారు…

